Narendra Modi: వైసీపీ ప్రభుత్వ పనితీరుకు ఇదే పెద్ద ఉదాహరణ: అనకాపల్లిలో ప్రధాని మోదీ

  • అనకాపల్లిలో ప్రజాగళం సభ
  • హాజరైన ప్రధాని మోదీ, చంద్రబాబు
  • నూకాలమ్మ తల్లికి ప్రణామాలు అర్పించిన ప్రధాని మోదీ
  • అల్లూరి సీతారామరాజును స్మరించుకుంటూ ప్రసంగం ప్రారంభం
  • వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన ప్రధాని
Modi speech in Anakapalle

అనకాపల్లి జిల్లా రాజుపాలెంలో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభకు ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. ఈ సభలో మోదీ ప్రసంగిస్తూ, స్థానిక నూకాలమ్మ తల్లిని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు అల్లూరి సీతారామరాజును స్మరించుకుంటున్నట్టు పేర్కొన్నారు. 

తాను సాయంత్రం 5.45 గంటలకు  వెళ్లిపోవాల్సి ఉందని, అందుకే ముందుగా ప్రసంగిస్తున్నాని, తాను వెళ్లిపోయిన తర్వాత కూడా ప్రజలు సభలో ఉండాలని, చంద్రబాబు ప్రసంగం వినాలని సూచించారు. 

"అనకాపల్లి బెల్లం, తెలుగు భాష రెండు కూడా మధురమైనవి, అద్భుతమైనవి. జూన్ 4న ఈ తియ్యదనం మరింత పెరగబోతోంది, ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం వస్తుంది, పార్లమెంటు ఎన్నికల్లోనూ ఎన్డీయే గెలవబోతోంది. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఎన్డీయే గెలవడం వల్ల డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుంది. తద్వారా అభివృద్ధి కొత్త ఎత్తులకు చేరుతుంది.

భారత్ ఇవాళ ఐదో అతి పెద్ద ఆర్థిక శక్తిగా అవతరించింది. చందమామ దక్షిణ భాగాన జెండా రెపరెపలాడించిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. ఏపీ నుంచి అనేకమంది ప్రవాసులు  విదేశాల్లో నివసిస్తున్నారు. భారత్ సాధించిన ఘనతతో ఇప్పుడు వారందరూ భారతీయులుగా ఎంతో గుర్తింపు పొందుతున్నారు. 

కాంగ్రెస్ పార్టీ, వైసీపీ రెండూ ఒకటే. కర్ణాటకలో ట్యాంకర్, భూ మాఫియా ప్రభుత్వం నడుస్తోంది... ఏపీలో శాండ్, ల్యాండ్ మాఫియా విజృంభిస్తున్నాయి. ఏపీలో దేవాలయాలపై దాడులు జరిగాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక దేవాలయాలకు రక్షణ కల్పిస్తాం. 

ఏపీ కోసం కేంద్రం అనేక కార్యక్రమాలు చేపట్టింది... కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం ఏమీ చేయడంలేదు. పైగా కేంద్ర పథకాలను వైసీపీ ప్రభుత్వం ముందుకు సాగనివ్వలేదు. కేంద్రం విశాఖ రైల్వే జోన్ కేటాయిస్తే, వైసీపీ ప్రభుత్వం అందుకు అవసరమైన భూమిని కూడా ఇవ్వలేదు. కేంద్రం భారీగా ఇళ్లు కేటాయించినా, ఈ ప్రభుత్వం నిర్మించలేదు.

ఉత్తరాంధ్ర సుజల స్రవంతి జలవనరుల ప్రాజెక్టు వైసీపీ ప్రభుత్వ పనితీరుకు పెద్ద ఉదాహరణ. ఈ ప్రాజెక్టును నాడు జగన్ రెడ్డి తండ్రి ప్రారంభించారు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందుకున్న జగన్, ఈ ప్రాజెక్టును మాత్రం పూర్తి చేయలేకపోయారు. పోలవరం ప్రాజెక్టును అడ్డుకుంటున్నారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.15 వేల కోట్లు ఇచ్చాం. వైసీపీ ప్రభుత్వానికి రైతుల గురించి పట్టింపే లేదు. 

ఎన్డీయే మంత్రం అభివృద్ధి... అభివృద్ధి... అభివృద్ధి. వైసీపీ మంత్రం అవినీతి... అవినీతి... అవినీతి! ఈ రోజున ఏపీలో అనేక పంచదార పరిశ్రమలు మూతపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల చెరకు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డబుల్ ఇంజిన్ సర్కారుతో చెరకు రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతాం. 

మత్స్యకారులకు బీమా సౌకర్యం కల్పిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నాం. మత్స్యకారుల కోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేశాం. విశాఖలో ఐఐఎం స్థాపించాం, ఈ ప్రాంతానికి పెట్రోలియం యూనివర్సిటీని తీసుకువచ్చాం, పూడిమడకలో గ్రీన్ ఎనర్జీ పార్క్ కు ఆమోదం లభించింది. 

నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ ప్రారంభించేందుకు రూ.1000 కోట్ల సాయం అందించాం. దీనివల్ల పెట్టుబడులు వస్తాయి, ఫార్మారంగంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అవినీతి ఎక్కడ ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉండదు. ఏపీలో అదే పరిస్థితి నెలకొని ఉంది. రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలి" అంటూ ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News